Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్‌లోకి జడ్డూ.. మాజీ CSK ప్లేయర్ ఎంట్రీతో జోష్లో ఆర్ఆర్ టీమ్

Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్‌లోకి జడ్డూ.. మాజీ CSK ప్లేయర్ ఎంట్రీతో జోష్లో ఆర్ఆర్ టీమ్

Ravindra Jadeja: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరన్లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, బదులుగా సంజు శాంసన్ ని సీఎస్కే తీసుకుంది. దీంతో జడేజా తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన జట్టుకే తిరిగి చేరాడు. రాబోయే సీజన్ కోసం అతను రూ.14 కోట్ల కాంట్రాక్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి జడేజా మారడంపై భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్  కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మార్పు జడేజా కెరీర్‌కు మళ్లీ ఊపు తీసుకువస్తుందని అభిప్రాయపడ్డాడు. 

బద్రీనాథ్ మాట్లాడుతూ.. జడేజా మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి చేరుకున్నట్టే.. సీఎస్‌కేలో గత కొన్ని సీజన్లలో అతని పాత్ర తగ్గిపోయింది.. కానీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా మారనున్నాడు. ఫినిషర్‌గా బ్యాటింగ్ చేయడంతో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి, సీనియర్ ప్లేయర్‌గా జట్టుకు నాయకత్వం అందిస్తాడని తెలిపారు. జడేజా ఐపీఎల్ కెరీర్‌ను రాజస్థాన్ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. 2008లో షేన్ వార్న్ నాయకత్వంలో టైటిల్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. 2009 వరకు ఆ జట్టులో కొనసాగిన అనంతరం కొచ్చి టస్కర్స్ కేరళ ద్వారా సీఎస్‌కేలో చేరాడు. 2025 సీజన్‌లో జడేజా తీవ్రంగా నిరాశపరిచాడు. 14 మ్యాచ్‌లలో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసి, సగటు 32కి పైగా, ఎకానమీ రేట్ 8.56గా నమోదు చేశాడు. జట్టు కూడా చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

►ALSO READ | CSK vs Sun TV: సీఎస్‌కే– ఎస్ ఆర్హెచ్ మధ్య వివాదం.. కోర్టులో కొత్త ట్విస్ట్

ఈ సీజన్ జడేజాకు కీలకమైనది.. అతను ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడతాడో క్లారిటీ లేదని బద్రీనాథ్ తెలిపారు. వచ్చే రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది.. కాబట్టి ఈ సీజన్‌లో అతను తప్పకుండా రాణించాల్సి ఉంటుందన్నారు. జడేజా ఇప్పటివరకు ఐపీఎల్‌లో 250కి పైగా మ్యాచ్‌లు ఆడి, 3000కిపైగా పరుగులు, 170కిపైగా వికెట్లు తీసుకున్నాడు. సీఎస్‌కేకు 2018, 2021, 2023 టైటిల్స్ సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 

ముఖ్యంగా 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై విజయంలో చేసిన కీలక పరుగులు జట్టు విజయానికి దోహదం చేశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ గత సీజన్‌లో తీవ్ర నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈసారి బలంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ జట్టు, మార్చి 30వ తేదీన గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.